హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బావమరిది రాజ్ పాకాల ఫామ్హౌస్లో నిన్న సోదాలు జరిపిన సైబరాబాద్ పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. దీంతో రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. భోజన విరామం తర్వాత విచారిస్తామని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తెలిపారు. పోలీసులు అక్రమంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, పోలీసులు నిబంధనల ప్రకారం ముందుకెళ్లేలా ఆదేశించాలని రాజ్ పాకాల పిటిషన్ లో కోరారు. నేడు విచారణకు హాజరవ్వాలని నోటీసులో తెలిపారు. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.