11-02-2025 12:36:48 AM
తమకు వర్తింపజేయాలంటున్న అగ్రికల్చర్, హార్టికల్చర్ వర్సిటీ ప్రొఫెసర్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు కొత్త సమస్యకు దారితీస్తోంది. రాష్ర్టంలోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 నుంచి 65 ఏండ్లకు ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అయితే కేవలం 12 వర్సిటీలకే ఈ మినహాయింపునిచ్చారు.
కానీ రాష్ట్రంలోని మిగిలిన అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫారెస్ట్ వర్సిటీలకు ఈ మినహాయింపును వర్తింపజేయడంలేదు. యూజీసీ స్కేల్ పొందుతున్న వారి వయోపరిమితిని పెంచింది. అయితే ఈ వర్సిటీల్లోని వారు సైతం యూజీసీ స్కేల్స్ పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా వర్సిటీల్లో పనిచేస్తున్నవారంతా తామేం అన్యాయం చేశామని, తమకు సడలింపునివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నారు. వయోపరిమితి పెంపును 2021నుంచి వర్తింపజేయాలని పలువురు ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు.