హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నగంరంలో ఆదివారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ వేడిగా ఉనన వాతావరణం.. సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా చల్లబడింది.
రాత్రి ఏడుగంటల సమయంలో రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, మణికొండ, నార్సింగి, మియాపూర్, కుత్బుల్లాపూర్, మోతీనగర్, అమీర్పేట, ట్యాంక్బండ్, నారాయణగూడ, ముషీరాబాద్, బషీర్బాగ్, బేగంబజార్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపై నిలిచిన వర్షపు నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు సముద్రమట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ధ్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్ల్లో సోమ, మంగళ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయిని ఐఎండీ వివరించింది.