25-02-2025 11:33:39 PM
3 శాతం డిస్కౌంట్ ప్రకటించిన రైల్వే శాఖ..
హైదరాబాద్ (విజయక్రాంతి): వెళ్లాల్సిన రైలు ప్లాట్ఫాం మీద ఉంటుంది... టికెట్ తీసుకుందామంటే పెద్ద క్యూ... దీంతో ఎక్కాల్సిన రైళ్లను చాలాసార్లు మిస్సయి ఉంటాం. తాజాగా ఈ సమస్యకు చెక్ పెడుతూ రైల్వే శాఖ ఆధునిక టెక్నాలజీతో యూటీఎస్ పేరిట యాప్ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా జనరల్ రైల్వే టికెట్లతో పాటు ప్లాట్ఫాం టికెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే రైలు టికెట్లు తీసుకునేందుకు ఈ యాప్ సౌకర్యంగా మారనుంది. ఈ యాప్లో ఒకేసారి నలుగురు ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మొదట ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రవేశపెట్టిన ఈ యాప్ను దశలవారీగా అన్ని రైళ్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ను రైల్వే శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది. డిజిటల్ విప్లవం నేపథ్యంలో భవిష్యత్తులో రైల్వే కౌంటర్ల వద్ద టికెట్లు కొనే పరిస్థితి లేకుండా చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.