18-03-2025 01:16:39 AM
ఎంపీ రవిచంద్ర వినతికి కేంద్ర రైల్వే మంత్రి సానుకూల స్పందన
ఖమ్మం, మార్చి 17 ( విజయక్రాంతి ):- ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు, రెండు పట్టణ ప్రాంతాల కలయిక తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి సోదాహరణంగా వివరించారు.
ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం పై సాధ్యాసాధ్యలను పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు. ఖమ్మం మధ్య గేటు సమస్య పై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు రైల్వే శాఖ పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ రవిచంద్ర మధ్య గేటు సమస్యను ప్రముఖంగా ప్రస్తావించారు.
కమాన్ బజార్, గాంధీ చౌక్ ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ప్రధాన మార్గమైన ఈ గేటు గడిచిన నాలుగు నెలలుగా మూసి ఉంచడం వల్ల వ్యాపార లావాదేవీలు స్థంభించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడో ప్లాట్ ఫాం విస్తరణ పనులు వేగం పెంచి. తక్షణమే మధ్య గేటు ను వినియోగంలోకి తేవాలని కోరారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అక్కడ ఆర్వోబీ లేదా అండర్ బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి సారించాలని ఎంపీ రవిచంద్ర పార్లమెంట్ లో రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.