బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి రైల్వే ఇన్స్టిట్యూట్ గొప్పగా కృషి చేస్తుందని రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏ. గోపి అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ఏడిఎస్ టి .వెంకటేశ్వర్లు, ఏ డిఈఈ ఎం ముఖేష్ లో ప్రారంభించారు. ఫ్లడ్ లైట్స్ ను ఎస్ ఎస్ ఈ, ఈ ఎల్ ఈ ఎం రతన్ మాలోతు ప్రారంభించారు.
రైల్వే కాలనీలో రైల్వే ఉద్యోగులు, వారి పిల్లలు క్రీడల్లో రాణించేందుకు గాను షటిల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. రాత్రి వేళల్లో కూడా క్రీడలు ఆడుకునేందుకు వీలుగా మైదానంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని రైల్వే ఉద్యోగులు, కార్మికులు, వారి పిల్లలు వినియోగించుకొని క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కృష్ణ ప్రసాద్, శ్యాం కుమార్, సోమ సంజీవరెడ్డి, పంకజ్ కుమార్ మీనా, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఉద్ది రమేష్, సిహెచ్. అనిల్, మజ్దూర్ యూనియన్ చైర్మన్ ఎస్ .నాగరాజు, సెక్రటరీ సాంబశివుడు, సంఘ సెక్రటరీ శివ, రైల్వే కార్మికులు, క్రీడాకారులు పాల్గొన్నారు.