27-03-2025 12:17:34 AM
ఎన్ని సార్లు లేచినా స్పీకర్ అనుమతివ్వలేదన్న రాహుల్ గాంధీ
అప్రజాస్వామికం అంటూ వ్యాఖ్య
న్యూఢిల్లీ: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడేందుకు ఎప్పుడు ప్రయత్నించినా, నాకు అనుమతివ్వలేదు. మేం చెప్పాలనుకునేది వినట్లేదు. ఇక చేసేదేం లేక ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నా. ఏడెనిమిది రోజులుగా ఇలాగే కొనసాగుతోంది. సభలో ప్రతిపక్షానికి చోటు లేదు. కుంభమేళా గురించి ప్రధాని ప్రసంగించినపుడు నిరుద్యోగం గురించి నేను మాట్లాడాలనుకున్నా. కానీ అనుమతి లభించలేదు.
ప్రజాస్వామ్యంలో ఇదో కొత్త విధానం. ఇక్కడ ప్రతిపక్షానికి అవకాశం లేదు. ఈ విధానం అప్రజాస్వామికం’ అని రాహుల్ పేర్కొన్నారు. కాగా సభలో సభా నియమాలు పాటిస్తూ సభా గౌరవాన్ని నిలబెట్టాలని స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీకి సూచించారు. ‘సభలో సభ్యులు సరిగ్గా ప్రవర్తించడం లేదని చాలా సందర్భాల్లో నా దృష్టికి వచ్చింది. తండ్రీ, కూతురు, తల్లి, భార్య, భర్తలు ఈ సభలో సభ్యులుగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా నిబంధనల ప్రకారం నడుచుకుంటారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు.