calender_icon.png 27 September, 2024 | 2:26 PM

భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజ

27-09-2024 12:50:21 PM

కొండపాక, (విజయక్రాంతి):  కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం నాడు రాహు కాల పూజ క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6-30 గంటలకు గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం కాగా విజయదుర్గా మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారి అభిషేకం నిర్వహించారు. ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాల పూజ శాస్త్రోక్తంగా జరిగింది. రాహుకేతు దోషనివారణ కోసం అష్టనాగపూజ నిర్వహించి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి రాజేంద్రప్రసాద్ తిరుపతి రెడ్డి మర్యాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.