calender_icon.png 5 October, 2024 | 2:46 PM

నిజం లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు

04-09-2024 04:36:56 PM

బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల,(విజయక్రాంతి): నిజం లేని ఆరోపణ చేస్తే సహించేది లేదని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాధ వీరవల్లి అన్నారు. బుధవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి వల్ల రైతులకు నష్ట జరుగుతుందని అనుకుంటే, రహదారి రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే బీజేపీ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. మంచిర్యాల - ఆర్మూర్ జాతీయ రహదారి 63 విస్తరణ అలైన్మెంట్ విషయంలో బీజేపీ పార్టీ పై కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులో చేస్తున్న తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

2018లో మోదీ మొదటి ప్రభుత్వంలో మొదటి అలైన్మెంట్ ఖరారు అయిందని, అప్పుడు కొందరు రైతులు చేసిన ఆందోళన వల్ల కేంద్రం ఆ రహదారి విస్తరణను తాత్కాలికంగా నిలిపి వేసిందని, ఆ తరువాత 2018 చివరిలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. అనంతరం 2023 లో రెండో అలైన్మెంట్ విషయంలో మోదీ రెండో ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ లో లక్షేట్టిపెట్ పట్టణం నుంచి రహదారి విస్తరణ చేయాలని ఖరారు చేయడంతో మున్సిపాలిటీ లో ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు జరుగుతాయనే అనే ఉద్దేశంతో లక్షేట్టిపెట్ పట్టణంలోని వివిధ రాజకీయ నాయకుల తో కలిసి నేను, ప్రస్తుత చెన్నూర్ శాసన సభ్యులు, అప్పటి బీజేపీ నాయకులు వివేక్ వెంకట్ స్వామితో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసి జాతీయ రహదారి విస్తరణ ను లక్షేట్టిపెట్ మున్సిపాలిటీ ప్రస్తుత రహదారి నుంచి కాకుండా పట్టణానికి బై పాస్ రోడ్ నిర్మించాలని కోరమన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రహదారి  విస్తరణ మరొకసారి పునః పరిశీలించాలని ఎన్ ఎచ్ ఏ ఐ ఆర్ ఓ సూచించడం జరిగిందని తెలిపారు.

2024 లో మరొక అలైన్మెంట్ ఎన్ ఎచ్ ఏ ఐ ప్రతిపాదించిందని అలైన్మెంట్ పూర్తిగా లక్షేట్టిపెట్ మండలం, హాజీపూర్ మండలాల్లో పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ రహదారి అవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని గతంలో ఇక్కడి రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు లో తమ పంట భూములు కోల్పోయారని, 2024 జూలై లో మాజీ ఎంపీ వెంకటేష్ నేతతో మరొసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలవడం జరిగిందన్నారు. లక్షేట్టిపెట్ పట్టణానికి బై పాస్ రోడ్, మిగితా ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రహదారి కాకుండా ప్రస్తుతం ఉన్న రహదారిని రెండు వైపులా విస్తరించాలని కోరడం జరిగిందని తెలిపారు. రైతుల కోసం బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుందని, కొందరు రాజకీయ బ్రోకర్లు రైతుల ముసుగులో అలైన్మెంట్ మార్పులో నా పై తప్పుడు ఆరోపణలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నానని, తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. తన పై ఆరోపణలు చేస్తున్న నాయకులు నేను రహదారి అలైన్మెంట్ మార్పులో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.

రహదారి విషయంలో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే జాతీయ రహదారిని పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయిస్తే తాము కూడా రైతులకు న్యాయం చేయడానికి రహదారి రద్దు కు పూర్తి మద్దతు తెలుపుతామని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంకోక్కసారి తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పట్టి వెంకట కృష్ణ, గుండా ప్రభాకర్, జోగుల శ్రీదేవి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బొప్పు కిషన్, గడ్డం స్వామి రెడ్డి, కర్ర లచ్చన్న, కషెట్టి నాగేశ్వర్ రావు, మెట్టుపల్లి జయరామ్ రావు, బొద్దున మల్లేష్, మధవరపు వెంకట రమణ రావు, బింగి ప్రవీణ్, బోలిషెట్టి అశ్విన్, మంత్రి రామన్న, రంగ శ్రీశైలం, కంకణాలు సతీష్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, శివ కృష్ణ, గాజుల ప్రభాకర్, అర్ణకొండ శ్రీనివాస్, రాజమౌళి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.