26-04-2025 12:00:00 AM
దౌల్తాబాద్, ఏప్రిల్ 25: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలు చేర్పించి మరింత బలోపేతం చేయాలని మండల విద్యాధికారి కనకరాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శేరి పల్లి, కోనాపూర్ లో నిర్వహించిన ముందస్తు బడిబాట కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, దుస్తులు, పుస్తకాలు, కంప్యూటర్ ఆధారిత బోధన అందిస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉపాధ్యాయురాలు అమల, హర్షిణి తదితరులు పాల్గొన్నారు.