calender_icon.png 16 April, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత డొల్లా

16-04-2025 12:50:52 AM

  1. కలుషిత నీటితో ఐస్ తయారి
  2. జ్యూస్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడకం
  3. ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం

సూర్యాపేట,ఏప్రిల్15(విజయక్రాంతి): భానుడి భగభగ మంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గొంతెండిపోతోంది. ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఉపశమనం కోసం పరుగులు తీస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు చెరుకు, పండ్ల రసాలు, మజ్జిగ ఇతర పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ఎక్కడపడితే జ్యూస్, చెరుకు రసం దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.

చాలా మంది చల్లదనం కోసం ఐస్ లేనిదే ఆ పానీయాలను ముట్టుకోరు. ఇంకొందరైతే అడిగి మరీ మరిన్ని ఐస్ గడ్డలు వేయించుకుంటారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఈ కేంద్రాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్తో లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పయని వెద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేసవి దందా...

వేసవి వచ్చిందంటే పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగ తదితర పానీయాలను విక్రయించే దుకాణాలు వెలుస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, ప్రధాన  కూడళ్ళలో ఇలాంటి దుకాణాలు 1500పైగా ఉంటాయి.

ఎండ కాలంలో బయటకు వచ్చే పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కనీసం 50నుంచి 60శాతం మంది ఎక్కడో ఓ చోట కచ్చింతంగా చల్లని పానీయాన్ని పుచ్చుకుంటున్నారు. కొందరు వ్యాపారుల్లో అవగాహన లేక పానీయాల్లో చల్లదనం కోసం అపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో తయారు చేసిన ఐస్ను వినియోగిస్తున్నారు.

అందుకే వేసవిలో ఆసుపత్రు బాటపటే  వారి సంఖ్య సుమారు 5 శాతం పెరుగుతున్నారని వైద్యులు చెపుతున్నారు. వాస్తవానికి పండ్ల రసాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆయా పండ్ల రసాల్లో కలిపే ఐస్ అనారోగ్యానికి దారితీస్తోంది.

జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు అపరిశుభ్రత నీటితో ఐస్ తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఐస్లో అనేక రకాల బాక్టీరియా, క్రీముల ఉంటాయి. అవి పండ్ల రసాల్లో కలిసిపోయి జ్యూస్ ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యం కల్గిస్తాయి.

సాధారణంగా ఐస్ను చూడగానే ఇది మంచి నీటితో తయారైందా లేదా అన్న విషయాన్ని మనమే కాదు.. నిపుణులు సైతం అప్పటికప్పుడు గుర్తించలేరు. ప్రస్తుతం మార్కెట్లో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఐస్తో పాటు ఎడిబుల్ రకం అందుబాటులో ఉంది. మొదటి రకాన్ని చేపలు, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు.. పండ్లు, ఇతర వస్తువులను ఎగుమతి చేసేందుకు.. ఆసుపత్రులలో  శవాలను భద్రపరిచే మార్చరీల్లో వినియోగిస్తారు.

దీని ధరచాలా తక్కువగా ఉంటుంది.  ఒక్కో పెద్ద క్యూబ్ రూ. 30నుండి రూ. 50 వరకు లభిస్తుంది. ఈ రకం ఐస్ తయారీ మంచి నీటిలో పరిశుభ్ర వాతావారణంలో తయారు చేయాలనే నిబంధనలు ఏమి లేవు. ఇక ఎడిబుల్ విషయాని కొస్తే ఖచ్చితంగా నియామాలను పాటించాలి.

మంచి నీటినే వినియోగించాలి. కాకపోతే ధరచాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో క్యూబ్ రూ. 100 నుంచి  150వరకు లభిస్తుంది. శీతల  పానీయాల్లో ఎడిబుల్ ఐస్ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మొదటి రకం ఐస్ను  వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు. 

సాధారణ రకం ఐస్‌తో ఆరోగ్యానికి ముప్పు

నాణ్యత లేని ఐస్ను వాడటంతో గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు తదితర ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోటా, అడినో, హెపటైటీస్‌ఏ వంటి వైరస్లతో ఊపిరితిత్తుల్లో సమస్యలు, పచ్చకామెర్లు సంభవిస్తాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు బారిన పడతారు. రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. చిన్నపిల్లలకు గవద బిళ్లల వ్యాధి వస్తుంది.

 డా. రామూర్తి, వైద్య నిపుణులు