15-04-2025 12:06:46 AM
జిన్నారం(గుమ్మడిదల), ఏప్రిల్ 14: ప్యారానగర్ డంప్ యార్డు పాపం ఎవరిదనే అంశం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పచ్చని పంట పొలాలు..వ్యవసాయ ఆ ధారిత ప్రాంతంలోకి ప్యారానగర్ డంప్ యార్డు తీసుకురావాలనే ఆలోచన ఎవరికి వచ్చింది.
2014 ముందే వైఎస్ ప్రభుత్వం డంప్ యార్డును ప్రతిపాదించగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్యారానగర్ ప్రాం తాన్ని డంప్ యార్డు గా మార్చాలని ప్రతిపాదనలను ముందుకు కొనసాగించి అన్ని అనుమతులను తీసుకువచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతే కాదు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం పలు వేదికలపై ప్యారా నగర్ లో అధునాతన డంప్ యార్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వైయస్ ప్రతిపాదనలు చేయగా, కేసీఆర్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లగా, కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ముందు కు తీసుకెళ్ళి పనులను ప్రారంభించింది. అసలు ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తే ప్రతిపాదనలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిదా, లేక అన్ని అనుమతులను మంజూరు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానిదా?.. లేక ప్యారా నగర్ పనులను ప్రారంభించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న సామెత డంప్ యార్డు విషయంలో వర్తిస్తుందనడానికి అతిశయోక్తి లేదు.
మెడ మీదికి వస్తేనే స్పందిస్తారా?
డంప్ యార్డు విషయంలో స్థానిక నాయకుల తీరు మరీ విడ్డూరంగా ఉంది. దివంగత వైఎస్ హయంలో ప్యారానగర్ డంప్ యార్డు ప్రతిపాదించగా అప్పుడు వైఎస్ హ యంలో కాంగ్రెస్ లో వున్న నాయకులు స్పందించలేదు. కానీ ప్రస్తుతం వ్యతిరేకంగా జేఏసి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇక్క డి స్థానిక నాయకులు సైతం పదవుల్లో వున్నారు. అప్పుడు వైఎస్ ప్రభుత్వంలో మాత్రం నోరు మెదపలేదు.
ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్యారనగర్ డంప్ యార్డు కి సంభందించిన అనుమతులను పూర్తి చేసింది. అప్పటి ఆ పార్టీలో నర్సాపూర్, గుమ్మడిదలలో ఎంపీపీలుగా, జడ్పీటీ సీలు, సర్పంచ్, ఎంపీటీసీ పదవులు అనుభవిస్తున్న ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. ప్యారానగర్ లో డంప్ యార్డు ఏర్పాటు చేస్తున్నామన్న నాయకుల చుట్టూ తిరుగుతూ ఇతర పైరవీ పనులు చేసుకున్నారు గాని ప్యారా నగర్ డంప్ యార్డు సమస్యను చెప్పలేదు.
అప్పుడు ఇక్కడి స్థానిక నాయకత్వానికి డంప్ యార్డు సమస్య కనబడలేదా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పుడు అదే పార్టీలో వున్న నాయకులు ముందుండి డం ప్ యార్డుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వైఎస్ ప్రభుత్వ ప్రతిపాదన సమయంలో, లేదా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అనుమతుల సమయంలో ప్రస్తుతం ఉన్న ఇదే చైతన్యం కనబరిస్తే అసలు డంప్ యార్డు ఏర్పాటుకు అవకాశం ఉండేదే కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏ పార్టీ, ప్రభుత్వం వున్నా మన ప్రాంతానికి నష్టం వాటిల్లితే వెంటనే స్పందించాలని సొంత పార్టీని సైతం ప్రశ్నించాలని చెబుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో వున్న నాయకులు ప్రభుత్వంపై చిత్త శుద్ధితో ఒత్తిడి తీసుకువచ్చి ప్యారానగర్ డంప్ యార్డు తరలించే విధంగా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.