calender_icon.png 19 October, 2024 | 8:08 PM

ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు

16-10-2024 12:31:06 AM

లక్ష్యసేన్, మాళవిక ఓటమి

డెన్మార్క్ ఓపెన్

ఒడెన్సే: డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధూ 21-8, 13-7 తేడాతో తైవాన్‌కు చెందిన పై యూ పోను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన సింధూ రెండో గేమ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే పై రిటైర్డ్‌గా వెనుదిరగడంతో సింధూ విజయం సాధించినట్లయింది.

ప్రిక్వార్టర్స్‌లో సింధూ చైనా షట్లర్ హన్ యూతో తలపడే అవకాశముంది. ఇక పురుషుల విభాగంలో భారత టాప్ సీడ్ లక్ష్యసేన్‌తో పాటు మహిళల విభాగంలో మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21-12, 19-21, 14-21తో గువాంగ్ జు (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

చైనా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన మాళవిక బన్సోద్ 13-21, 12-21 తేడాతో గుయెన్ (వియత్నాం) వరుస గేముల్లో ఓడి ఇంటి దారి పట్టింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ-శ్వేత పర్ణ జోడీ 18-21, 22-24 తేడాతో చైనీస్ తైపీ ద్వయం మీద ఓడిపోయి నిరాశపర్చింది.