టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోల్లో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ వేరు. ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద రిలీజ్ గా పుష్ప-2ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పుతుందని నిర్మాతలు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో చిత్రయూనిట్ విడుదల చేయనుంది. ఇందులో భారతదేశంలో 6,500 స్క్రీన్లు, ఓవర్సీస్లో 5,000 స్క్రీన్లలో విడుదల కానుంది.
పుష్ప-2లో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆరు భాషల్లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఒరియాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్, సుకుమార్ కలయిక గతంలో బ్లాక్ బస్టర్ అయిన సిన్మా పుష్ప. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో పేలింది. ఇప్పుడు పుష్ప-2 బన్నీ అభిమానులు, దేశంలో చాలా మంది ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది సంవత్సరంలో అత్యంత అంచనాలున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది.