22-04-2025 01:34:03 AM
అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం
కాటారం (భూపాలపల్లి), ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : సరస్వతి పుష్కరాలు మన జిల్లాలో జరిగే అత్యంత ప్రతిష్ఠాత్మక పుష్కరాలు కావడంతో, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ వంటి వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇచ్చినట్లు తెలిపారు.
ఆ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్దేశిత అన్ని పనులు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గడిచిన 21 రోజుల నుండి నీటి సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటి మీటర్లు నీరు తగ్గినట్లు తెలిపారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటి మీటర్లు ఉన్నట్లు తెలిపారు.
నీటి సామర్ధ్యాన్ని పర్యవేక్షణ చేస్తుండాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డిపిఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేష్, దేవస్థానం డిఈ తదితరులు పాల్గొన్నారు.