calender_icon.png 21 October, 2024 | 1:25 PM

పునేరి పల్టన్ బోణీ

20-10-2024 12:00:00 AM

తెలుగు టైటాన్స్ పరాజయం

హైదరాబాద్: ప్రొ కబడ్డీ 11వ సీజన్‌ను విజయంతో ఆరంభించిన తెలుగు టైటాన్స్ రెండో మ్యాచ్‌లో మాత్రం పరాజయం చవిచూసింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29-44తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమి పాలైంది. తొలి హాఫ్ 19 గట్టి పోరు ఇచ్చిన తెలుగు టైటాన్స్ రెండో హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

తమిళ్ తలైవాస్ 20 రెయిడ్ పాయింట్లతో పాటు 16 టాకిల్ పాయింట్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తెలుగు టైటాన్స్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసిన తలైవాస్ ఆరు పాయింట్లు సాధించింది. మరోవైపు తెలుగు టైటాన్స్ మాత్రం 21 రెయిడ్ పాయింట్లు, 7 టాకిల్ పాయింట్లకు మాత్రమే పరిమితమైంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ మరోసారి సూపర్ 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.

అటు తమిళ్ తలైవాస్ జట్టులో నరేందర్ హొసియార్, సచిన్‌లు పదేసి రైడ్ పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తర్వాతి మ్యాచ్ ఈ నెల 22న జైపూర్‌తో తలపడనుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పునేరి పల్టన్ బోణీ కొట్టింది. రెండో మ్యాచ్‌లో పునేరి పల్టన్ 34-25 తేడాతో హర్యానా స్టీలర్స్‌ను మట్టికరిపించింది. 15 రెయిడ్ పాయింట్లతో పాటు 13 టాకిల్ పాయింట్లు సాధించిన పునేరి పల్టన్ ఆలౌట్ ద్వారా 4 పాయింట్లు పొందింది.