01-04-2025 08:54:29 PM
నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు..
సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి..
భద్రాచలం (విజయక్రాంతి): సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయవద్దని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థి సంఘాలు చేస్తున్న ధర్నాకు సిపిఎం మద్దతు తెలపడంతో భద్రాచలం పట్టణంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులు సండ్ర భూపేంద్ర, కొప్పుల రవీంద్రనాథ్ లను ముందస్తుగా పోలీసులు మంగళవారం అరెస్టు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ... ప్రజా పాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిని నిలదీస్తున్న వారిపై నిర్బంధాలను ప్రయోగించటం ఏమిటని, అక్రమ అరెస్టులు చేయడమే ప్రజా పాలన అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలు ప్రయోగించడం ద్వారా ప్రజా ఉద్యమాలను అణచలేరని ఆయన అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు..