08-04-2025 12:00:00 AM
ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను, ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తెచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం అధికారులతో వేసవికాలం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ, నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూర్ ఆర్డీవోలు కృష్ణవేణి, గణేష్, జెడ్పి సీఈవో పురుషోత్తం, డిఆర్డిఓ మధుసూదన రాజు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి, డి వి హెచ్ ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డి సి ఓ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా నాయక్, డిహెచ్ఓ మరియన్న, డిపిఓ హరిప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.