calender_icon.png 26 October, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

17 నుంచి ప్రజాపాలన

28-08-2024 01:01:08 AM

పదిరోజులపాటు కార్యక్రమం.. రేషన్ కార్డులు, హెల్త్‌కార్డులే ఎజెండా

  1. గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి 
  2. 32 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి నిర్ణయం

22 జిల్లాల్లో జిల్లా సమాఖ్య భవనాలకు ఎకరం చొప్పున స్థలం 

 వచ్చే ఏడాదిలోపు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీ భవనాలు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయ క్రాంతి): సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీచేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీచేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు.

రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యా చరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చోంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించా లి.. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి.. గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా?.. రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా?.

అనే అంశాలను వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్‌లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే కార్డు ప్రామాణికంగా ఉంటుందని అన్నారు. 

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉం డాలని సీఎం అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు. పనిచేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. 

చారిత్రక భవనంగా పాత ఉస్మానియా!

ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే  బాధ్యతను చేపడుతామని సీఎం చెప్పారు. మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పేట్ల బుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పుడు గోషామహల్‌లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అక్కడికి తరలించేలా చూడాలని చెప్పారు.  

పనులు వేగంగా పూర్తి చేయాలి...

రాష్ర్టంలో కొత్తగా నిర్మించే ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు వీలుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాల్లో వీటిని నిర్వహించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 

సమాఖ్య భవనాలకు ఒక్కో ఎకరం..

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఒక్కో జిల్లాలో సమాఖ్య భవనాలకు ఒక ఎకరం స్థలం కేటాయించేందుకు అంగీకరించారు. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని  శిల్పారామం పక్కనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు.

మహిళా శక్తి సంఘాలు తయారుచేసే తమ ఉత్పత్తులతో అక్కడ ఏడాది పొడవునా వివిధ స్టాళ్లు నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రపంచ స్థాయి అతిథులు, వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా తప్పకుండా సందర్శించే స్థలంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.  ఏడాది పొడవునా నిర్వహించే ఎగ్జిబిషన్‌లా వివిధ రకాల ఉత్పత్తులు అక్కడ అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు.

గోషామహల్‌లో కొత్త ఉస్మానియా!

గోషామహల్‌లోని పోలీస్ స్టేడి యం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దాదా పు 32 ఎకరాల స్థలముందని, పోలీస్ విభాగం అధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని చెప్పా రు. రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశంలో స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు,  జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.   

సమన్వయంతో పనిచేయాలి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అధికారు లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల ని ఆదేశించారు. 

50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా..

రాబోయే 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసుకొని, కొత్త ఆసుపత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వివిధ ప్రాం తాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూరా నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించా రు.  కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు కాకుండా ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండేలా డిజైన్లు ఉండాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్స్‌లతో డిజైన్‌లను తయారు చేయించాలని తెలిపారు.