17-04-2025 02:10:04 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్షీట్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సామ్ పిట్రోడా, సుమన్ దూబేను కూడా ఈడీ సహ నిందితులుగా చేర్చింది. ఈడీ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాటే ఈ విషయంపై మాట్లాడారు. ‘12 సంవత్సరాల పాత కేసు ఇది. 12 సంవత్సరాలుగా ఏం జరగలేదు. వారు మనీలాండరింగ్ కేసు నమోదు చేసినా ఒక్కరూపాయి కూడా దొరకలేదు. ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ను అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. మేము వారిపై చివరి వరకూ పోరాడుతాం. బీజేపీ రాహుల్ గాంధీ రాజకీయాలు, ఆయన లేవనెత్తిన అంశాలు చూసి భయపడుతోంది.’ అని పేర్కొన్నారు.
ఆ పత్రికను ఏటీఎంలా వాడుకున్నారు
సోనియాగాంధీ, రాహుల్గాంధీ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను ఏటీఎంలా వాడుకున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇది కేవలం కేసుకు సంబంధించి నిరసన కాదు. ఇది తప్పును కప్పిపుచ్చే కుట్ర. కాంగ్రెస్కు నిరసన తెలిపే హక్కు ఉంది.
ప్రభుత్వ ఆస్తులను నేషనల్ హెరాల్డ్కు కట్టబెట్టే హక్కు లేదు. నేషనల్ హెరాల్డ్ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉండాల్సింది. సంస్థ ఏం చారిటీ నిర్వహించింది. వేల కోట్ల ఆస్తులను దోచుకున్నారు.’ అని ఆరోపించారు.