27-03-2025 01:37:41 AM
కొత్తపల్లి, మార్చి26 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని , అందుకే రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఈ నెల 28 న కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం రోజున కరీంనగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలోకిసాన్ మోర్చా నాయకులు, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఇట్టి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూరైతు ల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని , నేటికీ జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం రైతులు కాళ్ళ అరిగేలా సంబంధిత కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగాన్ని గోసపెడుతుందన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని , రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలలో రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇట్టి నిరసన దీక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి , జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి , మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు , కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి లతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.