19-04-2025 09:18:50 PM
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జునరెడ్డి..
ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు ఆందోళన..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసిందని, అయితే 75 శాతం పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పనులు పూర్తి చేయడంలేదని విమర్శించారు. లబ్ధిదారులు అధికారుల చుట్టూ, మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ తిరిగి విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నాయకులు వాల నవీన్, మేకల వికాస్, బత్తుల జీవన్, గోపగోని అరవింద్, లబ్ధిదారులు జేరిపోతుల సునీత, సువర్ణ, పరిమిల, సరిత, శారద తదితరులున్నారు.