06-03-2025 06:27:14 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): వేసవికాలంలో ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాలలో రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు.
జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కూలికి పని కల్పించడంతో పాటు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంతకుముందు అంకుసాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీని సందర్శించారు. నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను సంరక్షించాలని వాటి రక్షణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందిస్తూ రక్షించాలన్నారు. మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ దత్తారం, ఎంపీడీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.