22-03-2025 01:18:11 AM
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డికి వినతి
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 21: కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి రక్షించాలని సీపీఎం అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 283 ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కోర్టు ఆర్డర్ పేరుతో లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకొని..
ఆ భూములను రక్షించాలని అబ్దుల్లాపూర్ మెట్ సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ.. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ సర్వేనెంబర్ 283 ప్రభుత్వ భూమి ఇందులో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్లు చేసి అమ్ముకుని కోట్లు గడించారు.
ఆ భూమిని గతంలో రెవెన్యూ అధికారులు పీవోటీ కింద తీసుకొని, ప్రభుత్వ భూమిని బోర్డులు పెట్టిన తర్వాత, తిరిగి కొంతమంది అక్రమార్కులు ప్లాటు చేసి అమ్ముకొని కొన్న వారి చేత కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని తిరిగి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాలను తొలగించకుండా, కోర్టును ఆశ్రయించకుండా ఇన్ డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉందన్నారు.
గతంలో ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు చేపటితే అప్పటి తహసీల్దార్ రవీందర్ దత్ ఆ నిర్మాణాలను కూల్చివేయించారు. అప్పుడు కూలగొట్టిన స్థలాలలో తిరిగి ఇల్లు నిర్మిస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదన్నారు. కావున వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి, అక్రమ దారులు తెచ్చుకున్న కోర్టు ఆర్డర్ ని వేకెట్ చేయించి, కబ్దా దారుల నుంచి ప్రభుత్వ భూమి రక్షించాలని.. ఆ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీకి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు గుండె శివకుమార్, ముత్యాలు, రామారావు, పాలేటి ఆటం, పి శ్రీనివాస్, చిర్ర శివ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.