- ప్రొబేషనరీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ లగ్జరీ లైఫ్
- 17 కోట్ల ఆస్తి, 17 లక్షల వాచీ
- ఆమె తండ్రికి అధికారికంగా 40 కోట్ల ఆస్తి
- అయినా ఓబీసీ కోటాలో ఐఏఎస్ జాబ్
ముంబై, జూలై 11: మహారాష్ట్రలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారంలో సంచలనాలు బయటకొస్తున్నాయి. ఆమెకు కోట్ల ఆస్తి ఉన్నా ఓబీసీ క్రీమీలేయర్ పరిధిలోనే ఉన్నానని చెప్పి రిజర్వేషన్లో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక ఆమె జీవన శైలి గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. చేతికి ధరించే వాచీ ఖరీదే ఏకంగా రూ.౧౭ లక్షలట. గొంతెమ్మ కోరికలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ఆమె.. ఇప్పుడు మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నది. తీవ్ర విమర్శల నేపథ్యంలో పూజ శారీరక, మానసిక వైకల్యా లను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభు త్వం గురువారం కమిషన్ను నియమించింది.
రూ.17 కోట్ల ఆస్తి
పూజ ఖేద్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమెకు ఆలిండియా ర్యాంకు 841 వచ్చింది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా ఐఏఎస్ అధికారే. ఆయన పదవీ విరమణ చేశారు. ఆమె అనుమతి లేకుండా తన ఖరీదైన ఆడి కారుకు వీఐపీలు వాడే ఎర్ర బల్బులు పెట్టుకోవటం, తనకు ప్రత్యేక క్యాబిన్ కావాలని డిమాండ్ చేయటం, కారుకు మహారాష్ట్ర అధికారిక స్టిక్కర్ వాడ టం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వివాదం అంతటితో ఆగలేదు. ఆమె లగ్జ రీ లైఫ్ను చూసి అనుమానం వచ్చిన కొంద రు లోతుగా తవ్వగా విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి.
కోట్ల ఆస్తులున్నా రిజర్వేషన్ ఎలా వచ్చింది?
పూజ ఖేద్కర్ది ఓబీసీ సామాజికవర్గం. ఆమె ఓబీసీ కోటాలోనే ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారు. నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.8 లక్షలకంటే ఎక్కువ ఉంటే ఓబీసీలు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించవు. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్కు రూ.40 కోట్ల ఆస్తులున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన ఎన్నికల అఫివిట్లో అధికారికంగానే ప్రకటించారు. వార్షికాదాయం రూ.45 లక్షలు గా చూపించారు. పూజకు సొంతంగానే రూ.17 కోట్ల ఆస్తులున్నాయి. మరి ఆమెకు రిజర్వేషన్ ఎలా వర్తించింది? యూపీఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం ఎలా ఇచ్చిం ది? అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మెడికల్ టెస్టులకు డుమ్మా
వివాదం నేపథ్యంలో పుణె అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసిన పూజ ఖేద్కర్ను వాశీమ్ జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. గురువారం ఆమె అక్కడ బాధ్యతలుచేపట్టారు. ఆమె ఆస్తులతోపాటు ఆరోగ్యంపైనా ఇప్పుడు జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. పూజకు కంటిచూపు సమస్య ఉన్నదని, మానసిక వైకల్యం కూడా ఉందని స మాచారం. ఐఏఎస్ ఎంపికైన తర్వాత నిబంధనల ప్రకారం యూపీఎస్సీ వైద్య పరీక్షల కోసం పిలించింది. ఆరుసార్లు పిలిచినా ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్జంగ్ దవాఖానల్లో పరీక్షలకు వెళ్లలేదు. కొవిడ్ పాజిటివ్ అని, మరో సారి మరొకటని.. ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పి డుమ్మా కొట్టారు. చివరకు ఓ ప్రైవేటు దవాఖాన నుంచి ఎంఆర్ఐ రిపోర్టు తీసుకెళ్లి యూపీఎస్సీకి సమర్పించారు.
పూజ ఆస్తుల చిట్టా
- పూజ పేరుపై 110 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
- ఆమెకు ఆరు ఇండ్లు, 7 నివాస స్థలాలున్నాయి.
- 900 గ్రాముల బంగారం, వజ్రాలు ఆమె సొంతం.
- ఆమెకు ఖరీదైన నాలుగు కార్లున్నాయి. ప్రస్తుతం ఆడి కారు వాడుతున్నారు.
- రెండు ప్రైవేటు కంపెనీల్లో ఆమెకు వాటాలున్నాయి.
- మొత్తం కలిసి ఆమెకు సొంతంగా రూ.17 కోట్ల ఆస్తులున్నాయి.