22-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21(విజయక్రాంతి) : భూ విస్తీర్ణానికి అనుగుణంగా అడవుల విస్తరణ లేకపోవడంతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవంగా కేబీఆర్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పెస్కోవాతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందన్నా రు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు.
పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారమని పేర్కొన్నారు. ప్రజలు తమ స్వలాభం కోసం అడవులను నాశనం చేస్తూ, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసుకొంటున్నారని చెప్పారు. ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించాలని, ప్రకృతిని సంరక్షి స్తూ, ప్రకృతితో మమేకమై జీవించడంలోనే అర్థవంతమైన జీవితం ఉందన్నారు.
పట్టణీకరణ, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మా ణం, పోడు వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి కారణాలతో అడవులు నానాటికీ అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వనమహోత్సవం పేరిట అడవుల సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పెస్కోవా, అటవీ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.