బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
బీసీలకు 120 కాలేజీ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు మంజూరు చేయాలి
- ఫీజుల బకాయిలు రూ.8వేల కోట్లు విడుదల చేయాలి
- బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి రూ.20 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
- బీసీ సంక్షేమ శాఖ మంత్రితో బీసీ నేతల చర్చలు
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కాలేజీ హాస్టల్లో, బీసీ గురుకులాలలో సీట్లు దొరకక చాలామంది బీసీ విద్యార్థులు చదువు మానుకుంటున్నారని అందుకుగాను ప్రభుత్వం వెంటనే స్పందించి120 బీసీ కాలేజీ హాస్టళ్ళు, 150 బీసీ గురుకులాలు కొత్తగా వెంటనే మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీసీ సంఘం నేతలు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో చర్చలు జరిపారు.
బీసీల డిమాండ్లపై గంటసేపు చర్చలు జరిపినట్లు కృష్ణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కాలేజీ హాస్టళ్ళ లో సీట్లు దొరకక చదువు మానుకుంటున్నారు. వెంటనే సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే జీవో నెంబర్ 7 రద్దు చేసి పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని, ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగుల భర్తీకే కొత్త రోస్టర్ విధానం తెచ్చారు. దీనిని సవరించాలని కోరారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. విదేశీ విద్యా స్టై ఫండ్ బకాయిలు చెల్లించాలని, బీసీల అభివృద్ధికి మరిన్ని కొత్త పథకాలు పెట్టాలని మంత్రిని కోరారు.
ఈ చర్చలలో జాతీయ బీసి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, పృథ్వీ గౌడ్, బలరాం, సింహాచలం, చిక్కుడు బాలయ్య పాల్గొన్నారు.






