హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం తెలంగాణకు రానున్నారు. స్వాగతం నుంచి వీడ్కోలు వరకు రాష్ట్రపతికి వెంట మంత్రి సీతక్క ఉండనున్నారు. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్- 2024ను ముర్ము ప్రారంభించనున్నారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ కళామహోత్సవ్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలోని కళ, సంస్కృతి, చేతిపనులు పాక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. రాష్ట్రపతి హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు.
శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య కింది జంక్షన్లకు వెళ్లకుండా చూడాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. జంక్షన్ బేగంపేట్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్ టీ జంక్షన్, రసూల్పురా, సీటీఓ జంక్షన్, ప్లాజా, టివోలి, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా, త్రిముల్గేరీ క్రాస్ రోడ్లు, లోత్కుంట, బొల్లారం, రాష్ట్రపతి నిలయం పరిసర జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. “ఈ జంక్షన్లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉండవచ్చు. అందువల్ల ప్రజలు ఈ జంక్షన్లను రాకపోకలు సాగించకుండా చూడాలని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) పి.విశ్వ ప్రసాద్ తెలిపారు.