22-02-2025 05:32:53 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి. నారాయణ బాబు
కాటారం,(విజయక్రాంతి): మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్(National Lok Adalat) కంటే ముందు ఈనెల 26 నుండి మార్చి 7 వరకు ప్రీ లోక్ అదాలత్ లు నిర్వహించడం జరుగుతుందని, కక్షిదారులు రాజి మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి. నారాయణ బాబు( Legal Services Authority Chairman P. Narayana Babu) తెలిపారు. రాజి మార్గంలో పెద్దఎత్తున కేసులు పరిష్కారం చేసే ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ లు నిర్వహించడం జరుగుతుందని జడ్జి తెలిపారు. రాజి పడదగిన అన్ని సివిల్, క్రిమినల్, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్ కేసులు, వైవాహిక కేసులు, ఆస్థి తగాదాలు, అన్ని రకాల ట్రాఫిక్ కేసులు పరిష్కరించబడతాయని వారు అన్నారు. క్షణిక ఆవేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదని, విలువైన సమయం, మనః శాంతి, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని జడ్జి అన్నారు. రాజి మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతావరణం లో ప్రజలు జీవించాలని వారు సూచించారు .