పెద్దపల్లిలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
పెద్దపల్లి,(విజయక్రాంతి): రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజున మనం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. మంగళవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు.
1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందని, 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారత దేశంలో అంతర్భాగంగా మారిందని అన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసిందని, 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు.
మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించి, వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలందరికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ రూపొందిస్తుందని, రాజీవ్ ఆరొగ్య శ్రీ పథకాన్ని బలోపేతం చేసిందని మన జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వివిధ కోర్సులలో అవరమైన శిక్షణ అందించేందుకు ఎంపిడిఓ ప్రాంగణంలో ఆధునిక టాస్క్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, దీనిని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.
అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ప్రిన్సిపాల్ జిల్లా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, అదనపు కలెక్టర్లు జె.అరుణశ్రీ, శ్యాం ప్రసాద్ లాల్, డీసీపీ ఎం చేతన, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.