19-03-2025 12:40:47 AM
అంధకారంలో ఈదమ్మ పోచమ్మ ఆలయాలు
నాగర్ కర్నూల్ మార్చ్ 18 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీలో గ్రామదేవతలుగా కొలిచే ఈదమ్మ, పోచమ్మ దేవాలయాలకు విద్యుత్ అధికారులు విద్యుత్ కోతలు విధించారు. గత కొద్ది కాలంగా ఆలయ పక్కనే కాలనీవాసుల అవసరాల కోసం 5 రూపాయల కాయిన్ నీటి ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు.
కాగా అదే ప్రాంతంలో తాజాగా కొంతమంది వ్యక్తులు నీటి ప్లాంటును నూతనంగా ఏర్పాటు చేసుకోవడంతో ఈ ప్లాంటుపై విద్యుత్ అధికారులకు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ అధికారులు రెండు ఆలయాలకు విద్యుత్ కనెక్షన్ ను తొలగించినట్లు కాలనీవాసులు ఆరోపించారు. గ్రామదేవతలుగా కొలిచే ఈదమ్మ పోచమ్మ ఆలయాలు చీకట్లు కమ్ముకోవడంతో కాలనీవాసులు భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి ఏఈ మాన్య నాయక్ స్పందించారు ఆలయానికి అనుకొని అనధికారికంగా నీటి ప్లాంట్ కొనసాగుతుందని ఈ విషయంలో పలుమార్లు ఆలయ నిర్వాహకులు, ఆలయ కమిటీకి తెలియజేసినా పట్టించుకోలేదని కమర్షియల్ నీటి ప్లాంటుకు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. ప్రస్తుతం ఈ ఆలయానికి సుమారు 17వేల బిల్లు బకాయిలు కూడా ఉన్నాయని తెలిపారు.