18-03-2025 12:50:36 AM
రాజేంద్రనగర్, మార్చి 17 (విజయక్రాంతి) : ఆర్ ఎం సి ప్లాంట్ తో నిత్యం దుమ్ముధూళి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడ గ్రామం లో చాలా రోజులుగా ఆర్ఎంసి ప్లాంట్ కొనసాగుతోంది. ఈ ఆర్ఎంసి ప్లాంట్ తో ప్రతిరోజు తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
పంట లు కూడా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామం లో పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీ అధికారి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీ ఉన్నతాధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవ డంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చాలా రోజులుగా దందా
మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో చాలా రోజులుగా రెడీమిక్స్ ప్లాంటు కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజు చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారుల సహకారం లేనిదే ఈ దందా కొనసాగడం అంత సులువైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసి ప్లాంటు నిర్వహణకు పంచాయతీ అధికారులు తమ పూర్తి సహకారం అందిస్తున్నా రని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులకు పంచాయతీ అధికారుల అండదండలు దండిగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రామంలో ఆర్ఎంసి ప్లాంటు చాలా రోజులుగా కొనసాగడంతో గ్రామం పై కాలుష్యపు పడగ చాచిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పంచాయతీ అధికారి వింత సమాధానం గ్రామంలో ఆర్ఎంసి ప్లాంటు కొనసాగుతుండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటు న్నారా...? అని గ్రామ పంచాయితీ అధికారి వజ్ర లింగంను వివరణ కోరగా ఆయన వింత సమాధానం ఇచ్చారు.
గ్రామంలో చాలా రోజులుగా, తాను వీధుల్లో చేరక ముందు నుంచే ఆర్ఎంసి ప్లాంటు కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. నిబంధనల కు విరుద్ధంగా 111 జీవో పరిధిలో కొనసాగుతున్న ఆర్ఎంసి ప్లాంట్ పై ఏమైనా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా... ఆయన నీళ్లు నమిలారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ముద్దునిద్ర వీడి ఆర్ఎంసి ప్లాంటును వెంటనే మూసివేయాలని నర్కుడ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.