calender_icon.png 23 October, 2024 | 7:50 AM

మెడికల్ కాలేజీపై రాజకీయం!

11-07-2024 12:34:16 AM

వసతులు సమకూర్చకుండానే ప్రారంభించిన బీఆర్‌ఎస్

కళాశాల నిర్వహణకు అనుమతివ్వని ఎన్‌ఎంసీ

ఓట్ల కోసమే నడిగడ్డలో కాలేజీ ఏర్పాటు?

బీఆర్‌ఎస్‌పై స్థానికుల ఆగ్రహం

జోగులాంబ గద్వాల జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన నడిగడ్డలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో స్థానిక ప్రజలు ఎంతో సంతోషించారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ప్రాంతంలో కనీసం మెరుగైన వైద్యం అందుతుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. కాలేజీలో అన్ని వసతులను సమకూర్చకుండగానే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలేజీని ప్రారంభించింది. ప్రస్తుతం మొదటి విద్యాసంవత్సరం ప్రారంభానికి జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేసుకోగా.. సరిపడా వసతులు, ప్రొఫెసర్లు లేరని ఎన్‌ఎంసీ అనుమతిని నిరాకరించింది. కేవలం ఓట్ల కోసమే కళాశాలను ఆదరాబాదరాగా ప్రారంభించారని బీఆర్‌ఎ స్‌పై స్థానికులు మండిపడుతున్నారు.

 గద్వాల (వనపర్తి), జూలై 10, (విజయక్రాంతి) : పేద విద్యార్థులకు మెడిసిన్ విద్య అంటేనే అందని ద్రాక్షలా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ప్రకటించింది. అందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రకటించిన కాలేజీని నడిగడ్డ ప్రాంతంలో నిర్మించారు. భవన నిర్మాణం పూర్తయినా అన్ని వసతులను, పూర్తి స్థాయిలో అన్ని సబ్జెక్టుల ప్రొఫెసర్లను నియమించకుండానే ఆదరాబాదరగా అసెం బ్లీ ఎన్నికల సమయానికి ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కళాశాలను ప్రారంభించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి మెడిసిన్ విద్యను ప్రారంభించాలని ఎన్‌ఎంసీకు దరఖాస్తు చేసుకోగా.. కాలేజీని పూర్తి స్థాయిలో పరిశీలించిన ఎన్‌ఎంసీ విద్యార్థులకు సరిపడా బోధకులు, కావాల్సిన సామగ్రి లేనందున కళాశాల నిర్వహణకు అనుమతివ్వలేదు. 

రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలున్నా..

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనసాగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జాతీయ మహి ళా ఉపాధ్యక్షురాలిగా ప్రస్తుత మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కొనసాగుతున్నారు. తాజా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత బీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. వీరంద రూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయంగా పలుకుబడి ఉన్నా మెడికల్ కళాశాలకు వసతులను సమకూర్చి, విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలా అనుమతులు పొందేందుకు ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది, సామగ్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోలేదు. ఇవేమీ లేకుండానే జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేయడం వెనక భారీ కుట్ర దాగి ఉన్నదన్న అభిప్రాయం స్థానిక ప్రజల్లో వ్యక్తమవడంతో పాటు నేతలున్నా లేనట్టేనని మాట్లాడుకుంటున్నారు. 

నిరుద్యోల్లో నిరాశ..

కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన రావడంతో స్థానిక నిరుద్యోగుల నుచి ఊహకు మించి దరఖాస్తులు రావడంతో కలెక్టర్ లక్కి డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఉద్యోగాలొచ్చాయని సంబురంతో ఉన్న వారికి కళాశాల నిర్వహణకు అనుమతి రాకపోవడంతో ఆశలు ఆవిరయ్యాయి. 

కొండారెడ్డిపల్లికి మెడికల్ కాలేజీ!

నాగర్‌కర్నూల్, జూలై10 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సూచన ప్రాయంగా ఆమో దం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ మం త్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి పరిసరాల్లో నల్లమల్ల చేరువలో ఉన్న అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతానికి సమీపంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు భూ సేకరణ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలిసింది. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయని స్థానికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మహబూబ్‌న గర్ పర్యటనలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఈ అంశాన్ని సీఎం తెచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 

వసతులు వచ్చాక అనుమతికి దరఖాస్తు చేస్తాం 

మెడికల్ కళాశాలలో సరిపడా సిబ్బం ది, సామగ్రి, ఫర్నిచర్ లేకపోవడంతో జాతీయ వైద్య మండలి అనుమతులు నిరాకరించింది. జాతీయ వైద్య మండలి సూచించిన విధంగా పూర్తి స్థాయిలో సిబ్బంది, సామగ్రి, ఫర్నిచర్‌తో పాటు అన్ని వసతలు సమకూరాక తిరిగి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తాం. 

 పార్వతి, 

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్