30-04-2025 12:00:00 AM
ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్
ములుగు, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): న్యాయం కోసం, రక్షణ కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు పోలీసులు అండగా నిలిచి, బాధితులకు తగిన న్యాయం రక్షణ కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ములుగు ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో నమోదైన కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ ల వారీగా అడిగి తెలుసుకున్నారు. నమోదు చేసిన కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు వెంటనే న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలన్నారు.
పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలపై, నేర నియంత్రణకు సీసీ కెమెరాల వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. యువత సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పి శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్, డిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, సీఐ లు అనుముల శ్రీనివాస్, బి. కుమార్, గద్ద రవీందర్, జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఎస్త్స్రలు పాల్గొన్నారు.
పసరా ఎస్సైకి ఎస్పీ ప్రశంసలు
విధి నిర్వహణ, నేర పరిశోధన, గంజాయి నియంత్రణ, దొంగతనాలకు అడ్డుకట్ట, అక్రమంగా పశువుల రవాణా పిడిఎస్ రవాణాను కట్టడి చేస్తూ, నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చి పెట్టే విధంగా ప్రతిభ చాటుతున్న పసర ఎస్సై అచ్చా కమలాకర్ ను ఎస్పీ శబరీష్ అభినందించి, ప్రశంసా పత్రం, రివార్డు అందజేశారు.