అంతర్గతంగా దేశంలో పోలీస్ లు శాంతి భద్రతలు కాపాడుతున్నారు.. ఎస్పీ
వనపర్తి (విజయక్రాంతి): సమాజ భద్రత కోసం ప్రాణాలను లెక్క చేయకుండా, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పోలీస్ సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ అమరవీరుల స్తుపానికి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు.
అమరవీరుల పోలీస్ కుటుంబ సభ్యులకు కలెక్టర్, ఎస్పీలు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం వ్యక్తగత జీవితాన్ని పక్కన పెట్టి, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.