18-04-2025 12:00:00 AM
యువకుడి అరెస్ట్, బాలికను సఖి కేంద్రంలో అప్పగింత
కాగజ్ నగర్, ఏప్రిల్17(విజయక్రాంతి ):తల్లితండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిన బాలికను రక్షించారు పోలీసు లు. బాలికను తీసుకువెళ్తున్న యువకుడిని అరెస్ట్ చేసి బాలికను సఖి కేంద్రంలో అప్పగించారు. రైల్వే జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు కు చెందిన కాంచన దేవి కూతురు గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది.
కాంచన దేవి పిర్యాదు మేరకు కొత్తూరు పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలికను బీహార్ రాష్ట్రానికి చెందిన వివేక్ సింగ్ అనే యువకుడు రక్సౌల్ ఎక్స్ప్రెస్ లో బీహార్ కు తీసుకువెళ్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే కాగజ్ నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించగా.. జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తన బృందంతో రైలు కాగజ్ నగర్ చేరుకోగానే తనిఖీలు చేపట్టారు.
యువకుడు వివేక్ సింగ్ ను, బాలికను అదుపులోకి తీసుకుని కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక మైనర్ కావడంతో సఖి కేంద్రానికి సమాచారం ఇచ్చి అధికారులకు అప్పగించారు. యువకుడిని కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.