21-02-2025 05:44:40 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): చిలుకూరి బాలాజీ దేవస్థానంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. వీరరాఘవరెడ్డిని పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించి రాజేంద్రనగర్ కోర్టులో శుక్రవారం హాజరుపరిచి ఆ తరువాత చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరరాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
పలుచోట్లు రామరాజ్యం పేరిట డబ్బులు వసూలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచి విరాళాలు సేకరించారనే దానిపై వివరాలు రాబట్టేందుకు వీరరాఘవరెడ్డికి సంబంధించిన బ్యాంక్ స్టేట్ మెంట్ కోసం బ్యాంక్ కు మొయినాబాద్ పోలీసులు లేఖ రాశారు. ప్రస్తుతం నిందితుడి అకౌంట్ లో కేవలం రూ.20 వేలు ఉన్నట్లు గుర్తించారు. రంగరాజన్ పై దాడి కేసులో ఇప్పటి వరకు మొత్తం 20 మందిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు