calender_icon.png 22 September, 2024 | 4:53 PM

పత్తాలాటలో ప్రముఖులు

22-09-2024 02:43:55 PM

బెల్లంపల్లి నియోజకవర్గంలో వాడి, వేడి చర్చ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): వాళ్లంతా బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండలంలో పేరెన్నిక గల ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. ప్రజా ప్రతినిధులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార దర్పాన్ని ప్రదర్శించిన నేతలు. తాండూరు మండలానికి చెందిన ఈ ప్రజా ప్రతినిధులు అంతా ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. రాజకీయ అండదండలతో ఏళ్లుగా మూడు ముక్కలాటలో ఆరితేరిన ఘనులు.

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీరంతా ఒక్కసారిగా డబ్బులు పందెం కాస్తూ పేకాట ఆడుతూ వాంకిడి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి వార్తల్లోకెక్కడం పట్ల వాడి వేడి చర్చ జరుగుతోంది.

శనివారం సాయంత్రం ఉమ్మడి జిల్లాలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గల వాంకిడి మండలంలోని సరంది గ్రామ సరిహద్దులోని ఒక చెరువు ప్రాంతంలో పేకాడుతుండగా పోలీసులు వీరందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ వారిలో తాండూర్ మాజీ జెడ్పిటిసి సాలిగాం బానయ్య, తాండూర్ కో ఆప్షన్ సభ్యులు రహమత్ ఖాన్ లు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. వీరితోపాటు తాండూర్ లో ప్రముఖులుగా పేరొందిన మాస వెంకటస్వామి, పెద్ద బోయిన మల్లేష్, మడిశెట్టి కార్తీక్, కోట మురళి లు ఉండడం పట్ల ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పోలీసుల నుండి తప్పించుకున్న వారిలో మండల మాజీ ఎంపీటీసీ పురం రవీందర్ రెడ్డి, కిష్టంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కడారి రత్నాకర్ రావు, ఐఎన్టియుసి నాయకుడు పేరం శ్రీనివాస్,  ఎస్.మహేందర్ లాంటి ప్రముఖ నేతలు ఉండడం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో హార్ట్ టాపిక్ గా మారింది. పట్టుబడ్డ మాజీ ప్రజాప్రతినిధులను వాంకిడి పోలీసులు రూ2 లక్షల పూ చికత్తుతో స్థానిక తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారన్న విషయం తాండూర్ మండలం తో పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలో దుమారం లేపింది.