04-03-2025 02:30:31 PM
అరెస్టు అయిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి: సిఐటియు
నారాయణపేట,(విజయక్రాంతి): గత 11 నెలలుగా పెండింగ్లో ఉన్న మినీ అంగన్వాడిల ఏరియాస్ వేతనాలను విడుదల చేయాలని, పెరిగిన వేతనాలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పేర్కొంది. మంగళవారం ప్రజా దర్బార్ హైదరాబాద్ లోని ప్రజావాణిలో సీఐటీయు ఆధ్వర్యంలో రోజు వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతున్న మినీ అంగన్వాడిలను ప్రభుత్వం పోలీసుల చేత అక్రమ అరెస్టు పాల్పడుతోందని ఆరోపించారు. మినీ అంగన్వాడీలతో పాటు మెయిన్ అంగన్వాడీలను కూడా హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషనులకు తరలిస్తున్నారు. అంగన్వాడీలపైన నిర్బంధకాండను ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, సీఐటీయు జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు.
ఇవాళ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు అంగన్వాడీల అరెస్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ నిర్బంధ పాలనకు తెరతీస్తోందన్నారు. ప్రజా పాలన అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీలను అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి తప్ప ఆరెస్తులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం, నిర్బంధాన్ని ప్రయోగించడం చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నా సంగతి ప్రభుత్వము గ్రహించాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో, మద్దూరు, మరికల్, మక్తల్, ధన్వాడ తదితర మండలాల్లో అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.