హైదరాబాద్,(విజయక్రాంతి): రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత జరిగింది. తాజాగా రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల విల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలకు వెళ్లారు. రాజ్ పాకాల ఆ విల్లాలో లేకపోవడంతో ఎక్సైజ్ అధికారులకు మరో విల్లాలో రాజ్ ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అతని కోసం మరో విల్లాలో తనిఖీలకు చేసేందుకు ప్రయాత్నించిన ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారని బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. దీంతో రాయదుర్గంలో వివేకానంద, బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కొందరు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. పాలన చేతగాక, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలకు తెరలేపితుందన్నారు. ఎలాంటి నోటీస్ లేకుండా కేటీఆర్ ఇంటికి పోలీసులు రావడానికి కారణమేంటి..? బీఆర్ఎస్ నాయకులను అరెస్టు వెనుక మతలబు ఏంటి..? అని ప్రశ్నించారు.