22-02-2025 01:28:48 AM
మహబూబ్నగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో సర్కారు నిర్మించి పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు గత ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్ రూం ల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని మౌలాలి గుట్ట దగ్గర నిర్మించిన ఇండ్లకు గత సర్కారు పట్టాలను పంపిణీ చేసింది.
ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వము ఆ లబ్ధిదారుల వివరాలను సేకరించింది. మౌలాలిగుట్ట దగ్గర ఇచ్చిన లబ్ధిదారుల విషయంలో 243 మంది లబ్ధిదారులు అనరులని గుర్తించి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఏడు పని దినాలలో నోటీస్ కు సరైన సమాధానం అందించాలని లేనిెుడల డబల్ బెడ్ రూమ్ ఇల్లును రద్దు చేయడం జరుగుతుందని ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
జీవితాంతం బీపీఎల్ గానే ఉండాలా..?
గత ప్రభుత్వము డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వము గుంజుకోవడం ఎందుకని లబ్ధిదారులు తహసీల్దార్ను పలువురు ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి మంజూరు చేయడం జరిగిందని, ఎక్కడైనా అనరులు ఉంటే వారి దగ్గర తీసుకోవాలని, పేదల దగ్గర కూడా అనరులు అంటూ నోటీసులు ఇచ్చి మంజూరు చేసిన ఇల్లును తీసుకోవడం మంచి పద్ధతి కాదని కొంతమంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఇల్లు ఇచ్చిన సమయంలో మా దగ్గర ఏమీ లేదని, ఇల్లు ఇచ్చిన తర్వాత ఆర్థికంగా కొంత బాగుపడడం జరిగిందని, ఇప్పుడు సర్వే చేసి మీ దగ్గర ప్లాట్ తోపాటు ఇతర ఆస్తులు ఉన్నాయంటూ తీసుకోవడం ఎంత వరకు సమంజసమని నోటీసులు అందుకున్న లబ్ధిదారులు కన్నీరు పెట్టుకున్నారు. నోటీసులు అందుకున్న వారు నిర్దేశించిన సమయంలోపు వివరణ ఇవ్వాలని తాసిల్దార్ ఘాన్సీ రామ్ నాయక్ జారీ చేసిన నోటీసులలో పేర్కొన్నారు.