అక్రమాస్తుల కేసు
- ఏసీబీ సోదాలో బయటపడ్డ రూ. ౨.౯౩ కోట్ల నగదు
- అక్రమాస్తులు మొత్తంగా 6.70 కోట్లుగా గుర్తింపు
- అందులో 51 తులాల బంగారు అభరణాలు
- నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ అరెస్ట్
- కారుణ్య నియామకంతో వచ్చి అవినీతికి పరాకాష్ఠగా మారిన వైనం
అతనో మున్సిపల్ అధికారి.. రెవెన్యూ విభాగంలో ఆయనకు ఎదురేలేదు.. మున్సిపల్ వ్యవహారాలలో అడ్డూ అదుపూ లేని ఆయనతో వ్యాపార, రియల్ ఎస్టేట్ వర్గాలు చేయి కలిపాయి. అంతే, వెనక్కి చూసుకోకుండా ఆయన రెండు చేతులా సంపాదించాడు. కోట్ల రూపాయలు కూడబెట్టాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన ఓ ప్రొఫెసర్ వద్ద కూడా నరేందర్ లంచం తీసుకున్నాడని తెలుస్తున్నది.
నిజామాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్న నిజామాబాద్ మునిసిపల్ రెవెన్యూ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ దాసరి నరేందర్ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం నగరంలోని వినాయక్నగర్లోని అశోక టవర్, కోటగల్లిలోని నరేందర్ ఇళ్లతో పాటు నిర్మల్ పట్టణంలోని అతని అత్తవారింట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
నరేందర్ అక్రమ ఆస్తుల విలువ రూ. 6.78 కోట్లుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోదాల సందర్భంగా అధికారి ఇంట్లో భారీ మొత్తంలో రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నగదును లెక్కించేందుకు లెక్కింపు యంత్రాన్ని వినియో గించారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల్లో రూ.2.93 కోట్ల నగదు, నరేందర్తో పాటు అతని తల్లి, భార్య పేరిట ఉన్న ఆరు ఖాతాల్లో రూ.1.10 కోట్ల డిపాజిట్లు, 51 తులాల బంగారు అభర ణాలు, రూ.1.98 కోట్ల విలువైన 17 స్థిరాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కె ట్లో ఈ స్థిరాస్తుల విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో నరేందర్ను అరెస్ట్ చేశారు.
కారుణ్య నియామకంతో
తండ్రి మరణం తర్వాత 1996లో బిల్ కలెక్టర్గా కారుణ్య నియామకం పొందిన నరేందర్.. మునిసిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఎదిగాడు. నరేందర్కు చెబితే కార్పొరే షన్లో ఏ పనైనా అవుతుందనే స్థాయికి చేరుకున్నాడు. చట్టప్రకారం కాని పనులను సైతం స్వలాభం కోసం చేసి పెట్టేవాడు. నిజామాబాద్లో రెవెన్యూ విభాగంలో సూపరిం టెండెంట్ స్థాయి అధికారి లేకపోవడంతో ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన నరేందర్కు అడ్డుఅదుపు లేకుండాపోయింది.
రెవెన్యూ విభాగంలో అన్ని తానే కావడం, మునిసిపల్ రెవెన్యూ విభాగంలో లోటుపాట్లను గుర్తెరిగిన నరేందర్.. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాడు. గతంలో ఓ వృద్ధురాలికి సంబంధించిన పెన్షన్కు సంబంధించి డబ్బులు కాజేసినట్లు నరేందర్ను అప్పటి నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో నరేందర్కు బోధన్కు బదిలీ అయినా రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నాడు. అతనిపై గతంలో అనేకసార్లు పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ వ్యవహారాల్లో చేయి తిరిగిన అతనికి వ్యాపార, రియల్ ఎస్టేట్ వర్గాలు సహకరించాయి.
ఇలా కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఓ ప్రొఫెసర్ వద్ద నుంచి కూడా రూ.2.5 లక్షలను నరేందర్ లంచంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బును పెద్ద మొత్తంలో అతని బందువులు, ఇతర బినామీల పేరుమీద పెట్టు బడులు పెట్టాడు. తన బందువులు పెద్ద మొత్తంలో మహారాష్ట్రలో స్థిరపడటంతో నరేందర్ తెలంగాణాతో పాటు మహారాష్ట్రలో భారీగా ఆస్తులు కలిగిఉన్నట్టుగా తెలు స్తోంది.
నిజామాబాద్లో అతనికి ఉన్న 17 స్థిరాస్తుల ప్రభుత్వ విలువ 1.98 కోట్లు కాగా వాటి మార్కెట్ విలువ దాదాపు 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు నిజా మాబాద్ కొత్త కలెక్టరేట్ వద్ద దాదాపు 500 చదరపు గజాల స్థలాన్ని ఇటీవలే విక్రయించినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులు లోతుగా విచారిస్తే ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.