calender_icon.png 10 October, 2024 | 10:52 AM

గాంధీ ట్రస్ట్ భూమి అన్యాక్రాంతంపై పిల్

10-10-2024 12:37:59 AM

కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్, కోఠిలోని శ్రీమహాత్మా గాంధీ స్మారక నిధికి ఓ దాత ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైందంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారిం చింది. రాష్ట్ర సర్కార్‌కు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని కోటి గాంధీ స్మారక నిధికి చెందిన భూమి అన్యాక్రాంతం అయ్యిందని పేర్కొంటూ అదే గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం మరో నలుగురు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులైన సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ ఇతరులకు నోటీసులు జారీచేసింది.

ఆరువారాల్లోగా తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని సర్వే 241/ఎఎ/బి2/1లో మూడెకరాలు, సర్వే నంబర్ 241/ఎఎ/బీ2/2లో 2.34 ఎకరాలు చొప్పున 5.34 ఎకరాలను చట్ట వ్యతిరేకంగా 2022 ఆగస్టు 6న జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.

ఓ దాత ట్రస్టుకు ఇచ్చిన భూములను ప్రైవేట్ వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డులు మార్పు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. దానం చేసిన భూమిని ప్రైవేట్ వ్యక్తులపరం చేసిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ (తహసీల్దార్) చర్యలను రద్దు చేయాలని కోరారు.

శ్రీనివాసు కొండాయి అనే వ్యక్తికి ఆ భూమితో సంబం ధం లేని అరిగె శ్రీహరి (రిటైర్డు తహసీల్దార్), హైదరాబాద్‌లో ఉండే అరిగె విజయ్‌కుమార్ రిజిస్టర్ చేయడం పాత, కొత్త ఆర్వో ఆర్ చట్ట నిబంధనలకు వ్యతిరేకమని అన్నా రు. భూదాత అభీష్టానికి అనుగుణంగా ట్రస్ట్ కార్యకలాపాలను నిర్వహించాలని, అన్యాక్రాంత చర్యలను నిలుపుదల చేసి.. ట్రస్ట్ భూమిని కాపాడే విధంగా రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు.