హైకోర్టుకు తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోనే హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం 2016లో జీవో 31 అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ అవార్డు నోటిఫికేషన్ను గతంలో సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసినట్లు తెలియజేసింది.
అప్పీల్ నేపథ్యంలో పిటిషనర్ల నుంచి రైతుబంధు, పంట రుణాలు ఇతర పథకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం చేసిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో తమ భూమిపై నిషేధిత ఉత్తర్వులు తొలగించాలని, ధరణి పోర్టల్లో లావాదేవీలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారించారు. ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఫార్మాసిటీ ఏర్పాటు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
రైతులతో ఘర్షణ వైఖరి ఉండదని కూడా చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లింపుపై రైతులతో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రియ అమల్లోనే ఉందని తెలిపారు. రైతుబంధు విషయంలో దరఖాస్తు ఇస్తే పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులతో భూసేకరణ రద్దు అయ్యిందని, కాబట్టి ధరణి పోర్టల్లో రైతులు లావాదేవీలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
తమ భూములపై ధరణిలో లావాదేవీలకు అనుమ తించడం ద్వారా సింగిల్ జడ్జి తీర్పును ఆమోదించినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ అప్పీల్పై ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు కూడా లేవన్నారు. కనీసం రైతుబంధు, పంట రుణాలు కూడా పిటిషనర్లకు ఇవ్వడంలేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, రైతుబంధు మంజూరుకు సంబంధించి సానుకూలంగా పరిశీలిస్తామన్న అడ్వొకేట్ జనరల్ హామీని రికార్డుల్లో నమోదు చేసింది.
రైతులకు రైతుబంధుకు అనుమతించాలని, వారంలోగా పిటిషనర్లు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. రైతులు పంటరుణాలు, రైతుబందు వంటి పథకాల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వాటిపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పిటిషనర్లు అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.