17-04-2025 09:26:46 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల హద్దులు నిర్ణయించి చెరువును పరిరక్షించాలని గురువారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కు చెరువు పరిరక్షణ కమిటీ కన్వీనర్ సప్ప రవి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెరువు పరిరక్షణ కమిటీ కన్వీనర్ సప్ప రవి మాట్లాడుతూ.. ఈ చెరువుపై సుమారుగా 500 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికీ నలుగురు కలెక్టర్లు మారిన మాకు న్యాయం చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడిచే కొద్ది చెరువు మాయమయ్యేలా ఉందని తమరైన మాకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ ప్రాధేయపడ్డాడు. కలెక్టర్ స్పందిస్తూ.. చాలా రోజులుగా మా నోటీసులో ఉంది. ఈ విషయమై స్థానిక ఎమ్మార్వో తో కూడా చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. సాధ్యమైనంత వరకు అన్ని విధాలా మీకు న్యాయం జరిగేలా చూస్తాను. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే ఎఫ్ టీ ఎల్ హద్దులు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎఫ్ టీ ఎల్ బఫ్ఫర్ జోన్ విషయంలో కలెక్టర్ ని ప్రశ్నించగా.. అది తమ పరిధిలో లేదని ఇరిగేషన్ శాఖ వారు నిర్ణయిస్తారని సమాధానం దాటవేయడం కొసమెరుపు.