14-04-2025 06:09:20 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడి మూడు దశాబ్దాలు దాటినప్పటికీ ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని వెంటనే రాజ్యాంగ బద్ధంగా మున్సి పాలిటీకి ఎన్నికలు జరిపించేలా చూడాలని కోరుతూ మున్సిపల్ ఎన్నికల సాధన సమితి సభ్యులు సోమవారం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎన్నికల సాధన కమిటీ సభ్యులు మాట్లాడారు. రాజ్యాంగం రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రాజ్యాంగ ఫలాలు, హక్కులను అందించిన అంబేద్కర్, అదే రాజ్యాంగం స్ఫూర్తితో పాలకుల కర్తవ్యం గుర్తుచేస్తూ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరిపించేందుకు కృషి చేయాలని కోరారు.
ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి లేక ఆనేక మంది ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగితే పాలకవర్గం ఉండి అభివృద్ధితో పాటు నాయకత్వం కూడా పెంపొందుతుందని ఈ దిశగా అంబేద్కర్ పాలకులకు కనువిప్పు కలిగించాలని ఎన్నికల సాధన కమిటీ సభ్యులు కోరారు.