హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రాష్ట్ర శాసనసభకు 2023లో ఎన్నికలు జరిగినప్పుడు కోవ లక్ష్మి సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలను దాచిపెట్టారని, సరైన సమాచారం ఇవ్వలేదని, కనుక ఆమె ఎన్నిక చెల్లదని శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్నుల వివరాలను అందించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ ఆదేశించిందని, అందుకు విరుద్ధంగా కోవ లక్ష్మి అఫిడవిట్లో వివరాలు ఉన్నాయని పిటిషనర్ అభియోగం. సమాచారం ఇవ్వకపోవడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(2)కు విరుద్ధమని అన్నారు. అయితే ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు చెప్పాలన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.