15-02-2025 01:53:15 AM
ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక, ఆ ప్రక్రియలో జోక్యం చేసుకునే పరిధి న్యాయస్థానాలకు లేదని హైకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ఈ మేరకు పిటిషన్ను కొట్టివేసింది. కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి తన నామినేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకుందూరు మండలం కస్తూరిపల్లికి చెందిన పోచబోయిన శ్రీహరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్పై జస్టిస్ టి.వినోద్కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిన్న కారణాలతో తిరస్కరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని, ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక, ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చిచెప్పారు.
ఎన్నికలు సక్రమంగా జరగలేదనపుడు మాత్రమే, ఫలితాలు వెల్లడయ్యాక ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నామినేషన్ తిరస్కరణపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపారు.