గుత్తికోయలు కొట్టి చంపారు: మృతుడి భార్య
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని ఉమ్మడి బంగారుచెలక గ్రామపంచాయతీ గండ్రబంధంలో సోమవారం తాటి వెంకటేశ్వర్లు(50) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మృతుడి భార్య, బంగారుచెలక మాజీ సర్పంచ్ తాటి రాధ తెలిపిన వివరాల ప్రకారం.. తమ పొలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో వెంకటేశ్వర్లు ప్రతి రోజు ఉదయం 7 గంటలకే కుక్కను తీసుకొని గుత్తికోయ గుంపు మీదుగా పొలాల్లోకి వెళ్లి కుక్కను వదిలి తిరిగి ఇంటికి వస్తాడని చెప్పారు.
సోమవారం కూడా కుక్కను తీసుకొని వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ లేక పోవడంతో తిరిగి వస్తున్న క్రమంలో గుత్తికోయగుంపులో మృతదేహం ఉన్నదని కొందరు చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా మృతుడి తల, నుదిటిపై గాయాలు ఉండటాన్ని గమనించారు. దీంతో గుత్తికోయలే కొట్టి చంపారని తాటి రాధ ఆరోపించారు. లక్ష్మిదేవిపల్లి పోలీస్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.