07-03-2025 12:31:41 AM
నారాయణపేట, మార్చి 6(విజయక్రాంతి): జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోపు అనుమతులు ఇవ్వాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన టీజీ ఐ పాస్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాల గురించి పరిశ్రమల శాఖ జిఎం భరత్ రెడ్డి అదనపు కలెక్టర్ కు వివరించారు.
టీజీ ఐపాస్ కింద గత జనవరి నుంచి ఈ నెల 6 వరకు 19 పరిశ్రమల కై అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా వాటిలో 8 అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 11 ప్రాసెస్ లో ఉన్నాయని జీ.ఎం. తెలిపారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి హె సి లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
అయితే అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్టీవో మేఘా గాంధీ, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, సబ్ రిజిస్టార్ రామ్ జీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెహమాన్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అక్బర్ హబీబ్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత, భూగర్భ జల శాఖ సీనియర్ అసిస్టెంట్ చైతన్య కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి, మైనింగ్ శాఖ, కమర్షియల్ టాక్స్ అధికారి,తదితరులు పాల్గొన్నారు.